ప్రభుత్వాధికారం భోగంకాదు, బాధ్యత! రామాయణ కాలం నాటి మంచి కథ
రామాయణం ఉత్తరకాండలోని చిత్రమైన ఉదంతం ఇది. రామరాజ్యంలో ఒక శునకం తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి నేరుగా రాముడి కొలువుకు వెళ్ళింది. గుమ్మం దగ్గర లక్ష్మణుడు ఉన్నాడు. విషయం అడిగాడు. ‘స్వయంగా రాముడికే చెబుతాను. నీకు కాదు’ అంది కుక్క. లక్ష్మణుడు కోప్పడలేదు, చిన్నబుచ్చుకోలేదు. ‘నాకు చెబితే చాలు’ అనలేదు. ‘అలాగే’ అన్నాడు.
రామాజ్ఞతో లక్ష్మణుడు దాన్ని సభలో ప్రవేశపెట్టాడు. నిండుసభలో ధైర్యంగా నిలబడి తననొక పండితుడు అకారణంగా కొట్టాడని రాముడికి ఫిర్యాదు చేసిందా కుక్క. వెంటనే ఆ పండితుణ్ని పిలిపించాడు రాముడు. అతడు విషయం గ్రహించాడు. అపరాధాన్ని అంగీకరించాడు. కోపాన్ని అదుపు చేసుకోలేకపోయానని, అకారణంగా కుక్కను కొట్టడం తప్పే కనుక- తనకు తగిన దండన విధించమని కోరాడు. తాను చేసిన నేరానికి రాముడు ఈ లోకంలో తనను శిక్షించకపోతే పరలోకంలోనైనా ఈ పాపం తనను వెంటాడుతుందని యమదండన తప్పదని నివేదించాడు. సభలో ధర్మ నిపుణుల అభిప్రాయాలను కోరాడు రాముడు. ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు కుక్కే కలగజేసుకొని పండితుడికి ఏ శిక్ష విధించాలో సూచించింది. విచిత్రమైన ఆ సూచనకు సభ అశ్చర్యపడింది.
‘ఒక ముఖ్యమైన అధికార పీఠానికి ఈ పండితుణ్ని సర్వ పర్యవేక్షకుడిగా నియమించండి…’- ఇదీ ఆ కుక్క కోరిన పరిహారం! అందుకూ సభ నివ్వెరపోయింది. కుక్క కోరికలోని మర్మమేమిటో తెలియక విస్తుపోయింది సభ. మఠాధిపత్యం వరమవుతుందిగాని, శిక్ష ఎలా అవుతుందని అడిగారు సభ్యులు.
గతజన్మలో తానొక మఠాధిపతినని, తిరుగులేని అధికారం తనకు దఖలుపడిందని, ఎంతో ధర్మబద్ధంగా తాను బాధ్యతలు నిర్వహించినా- ఎక్కడో జరిగిన ఒక తప్పిదం కారణంగా తనకీ కుక్క జన్మ సంప్రాప్తమైందని చెప్పింది. ఆ చిన్న తప్పు కారణంగా నిరపరాధినైన తనకే శిక్ష పడినప్పుడు- ఈయన పండితుడే అయినా, దురహంకారి కావడం వల్ల అధికార మదంతో ఎన్నో తప్పులకు పాల్పడే అవకాశం తప్పక ఉంటుంది… దాంతో, జన్మజన్మలకూ పతితుడవుతాడు. కాబట్టి ఈ పండితుడికి ఏదో రకంగా పాలనాధికారాన్ని కట్టబెట్టడమే తగిన శిక్ష అవుతుందని కుక్క తేల్చి చెప్పింది.దాని ఆలోచనకు సభ జేజేలు పలికింది.
దీన్నిబట్టి, అధికారం ఎంత ప్రమాదకరమైనదో మనం గుర్తించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పతనానికి దారి తీస్తుందని గ్రహించాలి. ప్రభుత్వాధికారం భోగంకాదు, బాధ్యత! ప్రజలు నమ్మి చేతికిచ్చిన పవిత్రమైన రాజదండం అది. అధికారాన్ని కట్టబెట్టిన దేవుడే- ప్రజలకు అన్యాయం చేసినవారికి శిక్షలను సైతం అమలుచేస్తాడు. అధికారం అండతో అన్యాయాలకు, ప్రజాపీడనకు పాల్పడితే భగవంతుడు క్షమించడు. ఈ సత్యాన్నే రామాయణం ఒక కుక్క చేత బోధ చేయించింది.
అధికారమనేది చాలా సునిశితమైంది. నిశ్చయంగా అదొక ముళ్ల కిరీటం. ఆ కిరీటానికి పొదిగిన వజ్రాభరణాలను చూసి పొంగిపోతే చాలదు. అధికారంలో ఉండగా తప్పులు చేస్తే ఇలా తీర్పుల రూపంలో దాని ముళ్లు గుచ్చుకొంటాయి. ప్రజావేదికల ముందు… న్యాయస్థానాల్లోనే కాదు, రేపు దేవుడి కొలువులోనూ దోషిగా నిలబడవలసి వస్తుంది.ఈ కథలో పండితుడు తేల్చి చెప్పింది అదే. అధికారంలో ఉన్నవారు ప్రజల కన్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలన్నదే దీని సారాంశం!
ఆదిత్య హృదయం
Sri Lakshmi Ashtottara Shatanamavali Telugu శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
Aura Sheath and it’s 7 layers ఆరా షీత్ – దాని 7 పొరలు – విశ్లేషణ
Best Ayurveda books in telugu ఆయుర్వేద వైద్యులు మరియు పరిశోధకుల వద్ద ఉండవలసిన ఆయుర్వేద గ్రంధాలు
మన సనాతన హిందూ ధర్మం – మత్యయంత్రం తెలుగులో
విష్ణువు వేయి నామములు – Vishnu Veyi Namalu in Telugu